Friday, December 28, 2018

ప్రయాణములకు అనుకూల సమయాలు తెలుసుకుందాం..!

మానవుడు తన నిత్యజీవితంలో ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. అయితే కాలం కలిసి రాకపోతే తాడే పామై కరుస్తుందన్నట్లు... ప్రయాణాలు ఎప్పుడు పడితే అప్పుడు చేయడం మంచిది కాదు. ప్రయాణాలు ఎప్పుడు ఎలా చేయాలో శాస్త్రాలు వివరించాయి.

సుదూర ప్రయాణాలకు సోమ, బుధ, గురు, శుక్రవారాలు శుభప్రదం. అలాగే, విదియ, తదియ, పంచమి, సప్తమి, దశమి, ఏకాదశి, త్రయోదశి ప్రయాణానికి శుభ తిథులుగా పరిగణించాలి. ముఖ్యంగా దీర్ఘకాల ప్రయాణాలకు తీర్థయాత్రలు చేయటానికి అనువైన ముహూర్తాలను నిర్ణయించుకుని బయలుదేరటం మంచిది.

అలాగే శుక్ర, ఆది వారాలు పశ్చిమ దిశ ప్రయాణం మంచిది కాదు. గురువారం దక్షిణ దిక్కుకు ప్రయాణం చేయరాదు. భరణి, కృత్తిక, ఆర్థ్ర, ఆశ్లేష, పుబ్బ, విశాఖ, పూర్వాషాఢ, పూర్వభాద్ర అనే స్థిర లగ్నాల్లో ప్రయాణమే పెట్టుకోరాదు.

విదియ, తదియరోజులల్లోకార్యసిద్ధి, పంచమినాడు శుభం. సప్తమినాడు ఆత్మారాముడు సంతృప్తి చెందేలా అతిథి మర్యాదలు జరుగుతాయి. దశమిరోజు ధనలాభం. ఏకాదశి కన్యలాభమంత సౌఖ్యం. త్రయోదశి శుభాలను తెస్తుంది.

ఇక శుక్ల పాడ్యమి దుఃఖాన్ని కలిగిస్తుంది. చవితినాడు ఆపదలు వచ్చే అవకాశం. షష్ఠీనాడు అకాల వైరాలు. అష్టమినాడు అష్టకష్టాలు. నవమినాడు నష్టాలు. వ్యధలు కలుగుతాయి. ద్వాదశి నాడు మహానష్టాలు. బహుళ చతుర్ధీనాడు ప్రయాణం చేస్తే చెడును కలిగిస్తుంది. శుక్ల చతుర్దశినాడు ఏ పని కాదు.

ఇక మేషం, మిధునం, కర్కాటకం, కన్య, తుల, ధనుస్సు, మకరం, మీనం వంటి శుభ లగ్నాలలో ప్రయాణం చేపట్టడం మంచింది. ముఖ్యంగా సోమవారం తూర్పు దిశగా ప్రయాణాలు చేయకూడదు. ప్రయాణ ముహూర్తాలకు ఆది, మంగళ, శనివారాలు పాఢ్యమి, పంచ పర్వాలు, ద్వాదశి, షష్ఠి, అష్టమీలలో ప్రయాణాలు చేయకూడదు.

అశ్విని, మృగశిర, పునర్వసు, పుష్యమి, హస్త, అనూరాధ, శ్రవణం, ధనిష్ఠ, రేవతి శుభ నక్షత్రాలుగా పరిగణిస్తున్నారు. అందువల్ల ఈ నక్షత్ర కాలంలో ప్రయాణాలు ఆరంభించడం మంచిది.

పౌర్ణమి, అమావాస్యనాడు ప్రయాణాలు

మానవుడి మనసుపై గ్రహాల ప్రభావం ఉంటుందని తెలుసుకున్నాము. చంద్ర గ్రహ ప్రభావం మనసుపై స్పష్టంగా ఉంటుంది. పౌర్ణమినాడు చంద్రుడు పూర్ణ కళలతో ఉంటాడు. చంద్రుడు జలానికీ, లవణానికీ, మనసుకీ అధిపతి. అందుకే సముద్రంలో పౌర్ణమినాడు ఆటుపోట్లు ఎక్కువగా ఉంటాయి. అలాగే మన శరీరంలో కూడా నీరు, లవణాలు, మనసు ఉంటాయి కదా. వీటికీ అధిపతి చంద్రుడే కనుక మన శరీరానికీ ఆటుపోట్లు ఎక్కువగా వుంటాయి. ఆయితే ఇవి అంతగా పైకి కనబడవు. మన శరీరంలో ఆటుపోట్లెక్కువగా ఉన్నప్పుడు మనం ఏ విషయంలోనైనా సరైన నిర్ణయం తీసుకోలేక పోవచ్చు. ప్రయాణాల విషయంలో సరైన నిర్ణయాలు తీసుకోవటం ప్రయాణ సమయంలోకానీ, మన పనుల్లోకానీ చాలా అవసరం. అందుకే, ఆ నిర్ణయాలు తీసుకోలేని సమయంలో ప్రయాణం చేయవద్దని చెబుతారు. మొత్తానికి పూర్ణిమి రోజు పనులు ఏవి కావు.

ఇక అమావాస్యనాడు చంద్రుడు కనిపించడు. దీంతో రాత్రి పూట వెలుతురు చాలా తక్కువగా వుంటుంది. అందుకే అమావాస్యనాడు అర్ధరాత్రి ప్రయాణాలు చేయకూడదంటారు. వెలుతురు తక్కువగా ఉండటం మూలంగా దారి సరిగ్గా కనబడక ప్రమాదాలు జరగవచ్చు, చీకట్లో ఏదైనా చూసి ఇంకేదో అనుకుని భయపడవచ్చు, చీకట్లో దొంగల భయం కూడా ఉండవచ్చు. మనం ప్రయాణం చేసే వాహనం ఏ కారణం వల్లనన్నా ఆగినా ఇబ్బంది పడవచ్చు. రాత్రి పూట, అందులో చీకటి రాత్రి అలా జరిగితే ఎవరికైనా ఇబ్బందే కదా, అందుకే అమావాస్య అర్ధరాత్రి ప్రయాణాలు, అందులోనూ ఒంటరిగా అసలు ప్రయాణం చేయవద్దు. మొత్తానికి అమావాస్యనాడు ప్రయాణం చేస్తే ఆపదలు వస్తాయని శాస్త్రం చెబుతోంది....

పంచ భూతాలతోనే మంచి ఫలితాలు

మానవుని జీవనాన్ని శాసించేవి, సృష్టికి మూలమైనవి పంచ భూతాలు. భూమి, నీరు, ఆకాశము, అగ్ని, గాలి.. వీటిని సక్రమంగా ఉపయోగించటం ద్వారానే మానవుడు తన ఆరోగ్యకరమైన జీవితానికి బంగారు బాటలు వేసుకుంటాడు. అలానే మనం ఒక స్ధలం కొన్నా, ఒక ఇల్లు కొన్నా సుఖమైన జీవితాన్ని ఆ ఇంట్లో సాగించాలంటే అవే పంచభూతాలు కొన్న ఆ ప్రదేశాలలో వాస్తు పరంగా ఉండి తీరాలి. అలా ఉంటేనే ఆ ప్రదేశాన్ని కచ్చితమైన వాస్తుతో ఉన్న స్థలం లేదా ఇల్లు అంటాం. అలాంటి చోట శుభకరమైన ఫలితాలు ఉంటాయి.

నిజానికి వాస్తుశాస్త్రం పంచభూతాలకు అత్యంత ప్రాధాన్యతనిస్తోంది. వాస్తు ప్రకారం గృహ నిర్మాణాన్ని చేపట్టేవారు ప్రకృతికి సంబంధించిన పంచభూతాలకు కూడా తప్పక ప్రాధాన్యమివ్వాల్సి ఉంటుంది. అదేసమయంలో పంచ భూతాలకు హిందూ శాస్త్రంలో మంచి ప్రాధాన్యత ఉండటం అందరికీ తెలిసిన విషయమే. ఆకాశం, భూమి, గాలి, నీరు, నిప్పులకు తగిన ప్రాధాన్యం ఇస్తూ గృహాన్ని నిర్మించడం వల్ల ఆ గృహస్థులు ఎప్పుడూ సుఖమైన జీవితాన్ని అనుభవిస్తారని వాస్తుశాస్త్రం చెబుతోంది. పంచభూతాలకు అధిదేవతలైనవారి ప్రాముఖ్యాన్ని బట్టి గృహనిర్మాణం జరగడం ముఖ్యమని వాస్తు శాస్త్రం చెబుతోంది. ఇందులో భాగంగా పంచభూతాల అధిపతులకు అనుగుణంగా ఇంటిని నిర్మించుకున్నట్లైతే గ్రహాల అనుగ్రహంతో యజమానులకు శుభ ఫలితాలు లభిస్తాయి.

ఉదాహరణకు నిప్పుకు అధిపతి అగ్నిదేవుడు కాబట్టి వంటింటిని నిర్మించేటప్పుడు అగ్నిదేవునికి ఇష్టమైన దిక్కును అనుసరించి వంట గదిని అమర్చటం చేస్తే మంచి ఫలితాలను లభిస్తాయని వాస్తు శాస్త్రం చెబుతోంది. వాస్తు శాస్త్రం రీతిగా పరిశీలిస్తే పంచభూతాల ఆధారంగా ప్లేస్‌మెంట్‌ను నిర్మించుకోవాలి. దీనిప్రకారం వంటగది సూర్యుడు ఉదయించే దిక్కు తూర్పు వైపు ఉండటం మంచిది.

సూర్యరశ్మి వంటగదిపై నుంచి గృహంలోని అన్నీ ప్రాంతాలకు వ్యాపించటం వల్ల సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయి. మొక్కలు పెంచటంలో కూడా సూర్యరశ్మికి అనుగుణమైనటువంటి ప్రాంతాలలో కలప మొక్కలను పెంచితే దుష్టశక్తులు ఇంటి దరిచేరవు. అంతేగాక అభివృద్ది సూచనలు కూడా అధికంగా కానవస్తాయి.

ఒక్కో ప్రదేశాన్ని బట్టి ఈ పంచభూతాలు అన్నీ సరిగా లేకపోవచ్చు. ఆ ప్రభావం కారణంగా వాటిలో నివసించే వారికి రకరకాలైన అనారోగ్య సమస్యలు తలెత్తవచ్చు. అలాంటపుడు వాస్తు నిపుణులని కలిసి ఆయా ప్రదేశాలనిగాని, ఇళ్లనుగాని చూపించుకొని ఏవైతే సరిగాలేవో వాటిని శాస్త్ర ప్రకారం సమతుల్యంగా చేయంచుకొని సుఖమైన జీవితాన్ని గడపవచ్చు. ఉదాహరణకి కొన్న స్థలంలోగాని, ఇంటిలోగాని ఏదైనా భాగం కోత ఏర్పడితే ఒక విధంగా, నీటి సమస్య అయతే మరో విధంగా, ఇంటి కప్పు దోషం అయతే ఇంకో విధంగా, వంటగదుల్లో ఫ్లాట్ ఫాంల అమరికలో దోషాలుంటే వేరే విధంగా, స్థలంలో గాలి, వెలుతురు సరిగా లేకుంటే ప్రమాద ఘంటికలు మోగుతుంటాయి. ఏవైనా దోషాలుంటే వాటిని చక్కగా వాస్తు ప్రకారం సరిచేయవచ్చు.

అయితే వాస్తు శాస్త్రం ప్రకారం పంచ భూతాలకు తగిన దిక్కులకు ప్రాముఖ్యత ఇవ్వడం పరిపాటిగా వస్తోంది. దీనిప్రకారం ఏయే దిక్కులు ఎలాంటి ఫలితాలను అందిస్తాయో చూస్తే..

తూర్పు -  ఆరోగ్యం, ఆనందం, గృహంలో శాంతి, సంపద చేకూరటం,
పడమర -  సంతానాభివృద్ది, స్వచ్ఛత, అభివృధ్ది,
ఉత్తరం -  వ్యాపార అభివృద్ది, మంచి భవిష్యత్తు,
దక్షిణం -  అదృష్టం, వినోదం, కీర్తి,
వాయువ్యం -  తండ్రికి మంచి అభివృద్ది సూచకాలు, అధిక ప్రయాణాలు,
నైఋతి -  తల్లికి సౌఖ్యం, వివాహ సఫలం,
ఈశాన్యం -  వృత్తి పరమైన అభివృద్ధి,
ఆగ్నేయం  -  అదృష్టం

భూమి పూజ
గృహ నిర్మాణం సమయంలో ముఖ్యమైన ఘట్టాల్లో ఒకటి భూమి పూజ. దీనిని శంకుస్థాపన అని కూడా అంటారు. మన పంచభూతాల సమన్వయంతో నిర్మించ తలపెట్టిన గృహ నిర్మాణానికి ఎటువంటి ఆటంకం కలగకుండా చిరకాలం ఈ భూమిపై నిలవాలనే ఆకాంక్షతో భూదేవిని ప్రార్థిస్తూ చేసే పూజే భూమి పూజ..

కుజదోష ఫలములు వివరణ ..

కుటుంబేచ వ్యయే సౌఖ్యే । సప్తమే చాష్టమే కుజే ।
నరాణాం స్త్రీ వధం కుర్యాత్ । స్త్రీణాం భర్తృవధం తథా ॥
2,12,4,7,8 ఈ రాశులందు కుజుడున్నచో పురుషులకు భార్యా వియోగము, స్త్రీలకు భర్తృ వియోగము గలదు.

"కించ" అర్కేందు క్షేత్రజాతానాం కుజదోషో న విద్యతే ।
అర్కుడనగా సూర్యుడు, ఇందు అనగా చంద్రుడు. సూర్యుని రాశి సింహము. చంద్రుని రాశి కర్కాటకము. సింహ కర్కాటక రాశి జాతకులకు కుజదోషం రాదు.

"కించ" స్వౌచ్చ మిత్ర భ జాతానాం పీడకో న భవఎత్కుజః ।
అంగారకునికి స్వక్షేత్రములగు మేష వృశ్చిక రాశులలోను ఉచ్ఛ అయిన మకరము నందు, కుజునికి మిత్రులగు గురు, రవి రాశులైన ధనుః , మీన, సింహ రాశులలో జన్మించు వారికి కుజదోషం లేదు.

కించ దేవకేరళే ॥ ద్వితీయే భౌమదోషస్తు యుగ్మకన్యకయోర్వినా ।
మిధున, కన్య రాశులందు పుట్టిన వారికి రెండవ యింటయందున్న కుజదోషము లేదు.

ద్వాదశే భౌమదోషస్తు వృషతౌళిక యోర్వినా ।
తుల, వృషభ రాశులందు పుట్టినవారికి పండ్రెండింటనున్న కుజదోషము లేదు.

చతుర్థే భౌమదోషస్తు మేష వృశ్చిక యోర్వినా ।
మేష, వృశ్చిక రాశులందు పుట్టినవారికి నాల్గవయింటవున్న  కుజదోషము లేదు.

సప్తమే భౌమదోషస్తు నక్ర కర్కట యోర్వినా ।
మకరము, కర్కాటకములందు జన్మించు వారికి సప్తమ స్థానమందున్న కుజదోషము లేదు.

అష్టమే భౌమదోషస్తు ధనుర్మీన ద్వయోర్వినా ।
ధనూరాశి, మీనా రాశి జాతకులకు అష్టమ స్థానమునందున్న కుజదోషము లేదు.

కుంభే, సింహే నదోష స్స్యాత్ ।

కుంభ, సింహ రాశి జాతకులకు కుజదోష ప్రసక్తి లేదు.

గురు మంగళ సంయోగే భౌమదోషే న విద్యతే ।
కుజుడు, గురువుతో కలసియున్ననూ, గురుదృష్టి కుజుని పైనున్ననూ ఆ జాతకులకు కుజదోషము లేదు.

ద్విరతీయే ద్యూన గే పుంసాం స్త్రీణాం  చత్వారి రి వృగే ।
పురుషులకు సప్తమ, ద్వితీయ స్థానాల్లో కుజుడు మిక్కిలి దోషకారి. స్త్రీలకు చతుర్థ, అష్టమ స్థానములో ఉన్న కుజుడు మిక్కిలి అపాయకారి.

ఉభయోరష్టమం రోషం భౌమదోషం వదెద్బుధః ।
స్త్రీపురుషులకు అష్టమ స్థానంలో చాలా ప్రమాదకారి.

దంపత్యోర్జన్మకాలే వ్యయ ధన హి ఋతే సప్తమే రంధ్ర లగ్నే ।
లగ్నా చంద్రాచ్చ శుక్రాదపి ఖలు నివసన్ భూమి పుత్రా స్తయోశ్చ ॥

భార్యాభర్తల జన్మ రాశికి ద్వాదశ, ద్వితీయ, చతుర్థ, అష్టమ లగ్నములలో ఎక్కడ కుజుడున్ననూ దోషకారి. ఈ దోషము జన్మలగ్నమునుండి గాని, చంద్రుడున్న రాశినుండి గాని, శుక్రుడున్న రాశినుండి గాని, కుజదోషమును చూచుకోవలయును. దంపతులకు జన్మరాశి, చంద్రరాశి, శుక్రరాశుల నుండి ఎక్కడ కుజదోషమున్ననూ అది పరిహార శక్యము.

దాంపత్యం దీర్ఘకాలం నుత ధనబహుళం పుత్రలాభం చ సౌఖ్యం ।
దద్యాదేకత్ర హీనో మృతిరఖిలభయం పుత్రనాశం కరోతి ॥

పైన చెప్పిన రీతిలో నున్న కుజదోషము పరిహారమైనచో దంపతులకు సుఖదాంపత్యం, సంతానం, ధనవృద్ధి, సౌఖ్యం సిద్దించును. ఇరువురిలొ ఏ ఒక్కరికి కుజదోషమున్ననూ మరణము, భయము, గర్భశోకము కలుగును...

Tuesday, December 25, 2018

దుర్ముహూర్తం అంటే ఏమిటీ? ఎలా ఏర్పడుతుంది?

మానవ నిత్య జీవితంలో ఎన్నో సంస్కారాలు చేయాల్సి ఉంటుంది. వాటి నిర్వహణకు శుభ ముహూర్తాలు అవసరమవుతాయి. అయితే శుభ ముహూర్తాలతో పాటు దుర్మూహూర్తాలపై కూడా అవగాహన ఉండాలి. అప్పుడే మనం మంచి ముహూర్తమేంటో అర్థం చేసుకోగలము.

నక్షత్ర ప్రమాణమును బట్టి విడువ తగిన కాలమును వర్జ్యం అంటారు. దినప్రమాణమును బట్టి, వారమును బట్టి విడువ తగిన కాలమును దుర్మూహుర్తం, రాహూకాలము అంటారు. గ్రంథాలలో దుర్మూహుర్తమును మాత్రమే చెప్పారు. రాహుకాలంను గూర్చి చెప్పినట్లుగా లేదు. రాహు కాలమును తమిళులు ఎక్కువగా పాటిస్తూ ఉంటారు. మన ప్రాంతమున వర్జ్యము, దుర్మూహూర్తమును పాటిస్తే సరిపోతుంది.

దుర్ముహూర్తం వారమునకు సంబంధించిన దోషము. ఇది సూర్యోదయము 6 గంటలకయ్యేటప్పుడు దుర్మహూర్తం ఈ విధముగా వచ్చును. దీని ప్రమాణం 48 నిమిషాలు, ఆదివారం సాయంత్రము 4-32కు. సోమవారం మధ్యాహ్నం 12-28 మరల 2-58కు మంగళవారం ఉదయం 8-30కు, మరల రాత్రి 11-50కు, బుధ వారం ఉదయం 11-41కు, గురువారం మధ్యాహ్నం 2-54కు, శుక్రవారం మధ్యాహ్నం 12-28కు శనివారం ఉదయం 2-40కు దుర్మహూర్తం వచ్చుచుండును. ఘడియల్లో ఆది-26, సోమ-16, 22 మంగళ-6 మరల రాత్రి 11-50 బుధవారం-11ఘ, గురువారం-10, శుక్ర-16 శని-4 ఘడియలకు వచ్చును.

పంచకరహితము
ముహూర్తం ఏర్పరచుకొను నాటికి తిధి, వార, నక్షత్ర లగ్న సంఖ్యలను కలిపిన మొత్తమును 9చేత భాగించగా శేషము 3-5-7-9 ఉన్న ముహూర్తములు రహితమైనవని గ్రహించాలి. 1 మిగిలిన మృత్యు పంచకం అగ్నిపంచకం, 4 రాజపంచకం, 6 చోరపంచకం, 8 రోగపంచకం ఇవి దోషకరమైనవి.

శూన్యమాసము
శూన్యమాసములో ఎటువంటి శుభకార్యం చేయరాదు. శూన్యమాసం, ఆషాఢం, భాద్రపదము, పుష్యం.. ఇవికాక మీన, చైత్రము, మిధునాషాఢము, కన్యాభాద్రపదము, ధనుఃపుష్యము. ఇవి శూన్యమాసములే సూర్యుడు ఆయా రాసులలో ఉన్నప్పడు శుభకార్యముల గూర్చి తలపెట్టరాదు.

మూఢము లేక మౌఢ్యమి
రవితో కలసి గురు శుక్రులలో ఎవరైనను చరించు వేళను మూఢమందురు. అస్తంగత్వ దోషము ప్రాప్తించుటతో శుభమీయజాలని కాలమిది. కాబట్టి ఎలాంటి శుభకార్యములైనను ఈ కాలములో జరుపరాదు.

కర్తరి - ఏయే కార్యములయందు జరిగించరాదు ?
కర్తరి అనగా సూర్యుడు భరణి 4పాదమున కృత్తిక 4వ పాదములలోను, రోహిణి 1వ పాదమున సంచరించు కాలమును కర్తరి అంటారు. భరణీ 4వపాదము డొల్లకర్తరి అంత చెడ్డదికాదు. మిగతా కాలమంతయు చాలా చెడ్డది. గృహనిర్మాణాది కార్యములు, నుయ్యి త్రవ్వట, దేవతా ప్రతిష్ట మొదలగు ఈ కాలంలో చేయరాదు.

త్రిజ్యేష్ట విచారణ
తొలుచూలు వరుడు, తొలిచూలు కన్యక జ్యోష్ట మాసం వీటి మూడింటిని త్రిజ్యేష్ట అని అంటారు. వీనిలో ఒక జ్యేష్టం శుభకరం. రెండు జ్యేష్టములు మధ్యమం. మూడు జ్యేష్టములు హానీ. కాని తొలిచూలు వరకు ద్వితీయాది గర్భజాతయగు కన్యను తొలిచూలు కన్య ద్వితీయాది గర్భజాతకుడగు వరుని పెళ్లాడినప్పుడు జ్యేష్టమాసం శుభకరమైందే..

Sunday, November 25, 2018

*అష్ట దిక్పాలకులు*

*అష్ట దిక్పాలకులు*

〰〰〰〰〰〰〰
1.ఇంద్రుడు - తూర్పు దిక్కు.
〰〰〰〰〰〰〰
ఇతని భార్య పేరు శచీదేవి, ఇతని పట్టణం అమరావతి, అతని వాహనం ఐరావతం, వీరి ఆయుధం వజ్రాయుధము.

〰〰〰〰〰〰〰
2.అగ్ని - ఆగ్నేయ మూల
〰〰〰〰〰〰〰
ఇతని భార్య పేరు స్వాహాదేవి, ఇతని పట్టణం తేజోవతి, అతని వాహనం తగరు, వీరి ఆయుధం శక్తిఆయుధము.

〰〰〰〰〰〰〰
3యముడు - దక్షిణ దిక్కు
〰〰〰〰〰〰〰
ఇతని భార్య పేరు శ్యామలాదేవి, ఇతని పట్టణం సంయమిని, అతని వాహనం మహిషము, వీరి ఆయుధం దండకము.

〰〰〰〰〰〰〰
4.నైఋతి - నైఋతి మూల
〰〰〰〰〰〰〰
ఇతని భార్య పేరు దీర్ఘాదేవి, ఇతని పట్టణం కృష్ణాంగన, అతని వాహనం గుఱ్ఱము, వీరి ఆయుధం కుంతము.

〰〰〰〰〰〰〰
5.వరుణుడు - పడమర దిక్కు
〰〰〰〰〰〰〰
ఇతని భార్య పేరు కాళికా దేవి, ఇతని పట్టణం శ్రద్ధావతి, అతని వాహనం మొసలి, వీరి ఆయుధం పాశము.
〰〰〰〰〰〰〰

6.వాయువు - వాయువ్య మూల
〰〰〰〰〰〰〰
ఇతని భార్య పేరు అంజనాదేవి, ఇతని పట్టణం నంధవతి, అతని వాహనం లేడి, వీరి ఆయుధం ధ్వజము.

〰〰〰〰〰〰〰
7.కుబేరుడు - ఉత్తర దిక్కు.
〰〰〰〰〰〰〰
ఇతని భార్య పేరు చిత్రరేఖాదేవి, ఇతని పట్టణం అలక, అతని వాహనం నరుడు, వీరి ఆయుధం ఖడ్గము.

〰〰〰〰〰〰〰
8.ఈశాన్యుడు - ఈశాన్య మూల.
〰〰〰〰〰〰〰
ఇతని భార్య పేరు పార్వతీ దేవి, ఇతని పట్టణం యశోవతి, అతని వాహనం వృషభము, వీరి ఆయుధం త్రిశూలము.

Wednesday, November 7, 2018

జాతకాన్ని పరిశీలించటం ఎలా ?

జాతకచక్రంలో కేవలం రాశి చక్రాన్నే కాకుండా బావచక్రాన్ని,నవాంశ చక్రాన్ని,షోడశ వర్గ చక్రాలను కూడా పరిశీలించాలి. జాతకచక్ర పరిశీలన చేసేటప్పుడు షోడశ వర్గ చక్రాలను కూడ జాతకచక్రంలోని పరిశీలించాలి.ఈ షోడషవర్గుల పరిశిలన వలన జాతకచక్రంలోని రహస్యమైన అంశములను తెలుసుకొనుటకు అవకాశము కలదు.

*లగ్న కుండలి(D1)*

లగ్న కుండలి జాతకానికి సంబంధించిన అన్ని అంశాలను తెలియ జేస్తుంది. మనిషి మనస్తత్త్వం, శారీరక స్థితి, గుణగణాలు, జీవన విధానం మొదలైన అనేక విషయాలు లగ్నకుండలి ద్వారా తెలుసుకొవచ్చు.

*నవాంశ కుండలి(D9)*

రాశి చక్రమందు యోగం ఉండి నవాంశ యందు గ్రహాల స్ధితి యుతులలో అవయోగ మేర్పడిన రాశి యందలి ఫలితమునకు విఘాతం కలుగును.రాశిచక్రం జన్మమైతే నవాంశ ప్రాణం.నవాంశ కుండలి మనిషి భాగ్యాన్ని, వైవాహిక జీవితాన్ని తెలియ జేస్తుంది. ఒక మనిషి అదృష్టవంతుడా, కాదా, అదృష్టం దేని ద్వారా వస్తుంది. తదితర విషయాలు వివాహానికి సంబంధించి వివాహ యోగం ఉన్నదా, లేదా, జీవిత భాగస్వామికి సంబంధించిన విషయాలు, వైవాహిక జీవితం ఎలా ఉంటుంది మొదలైన విషయాలు నవాంశ కుండలి ద్వారా తెలుస్తాయి.

*హోరా(D2) కుండలి*

హోరా కుండలి ఆర్థిక స్తితిని గురించి తెలియ జేస్తుంది. అలాగే మనలో ఉండే వివిధ అంశాల సంతులతను సూచిస్తుంది. రవిహోర(సింహరాశి)లో ఎక్కువ గ్రహలు ఉన్నట్లయితే కృషితో ఎక్కువ సంపాదన ఉంటుంది.సింహం మనలో ఉండే బహిర్గత అంశాలను, కర్కాటకం అంతర్గత అంశాలను సూచిస్తుంది.

*ద్రేక్కాణ(D3) కుండలి*

వైద్య జ్యోతిష్యంలో ద్రేక్కాణం ద్వారా ఏ శరీర భాగానికి అనారోగ్యం కలుగుతుందో తెలుసుకోవచ్చును.
ద్రేక్కాణం శరీర భాగాలు, ఆరోగ్య సమస్యల గురించి చెబుతుంది. ఇది లగ్న కుండలి లో 3 వ భావం, సోదరీమణులు, స్నేహితులు మరియు భాగస్వామ్యాలు గురించి చెబుతుంది. ఇది మన సామర్థ్యాన్ని పని, లేదా ఒక సమూహం లో, కొన్ని లక్ష్యాన్ని సాధించడాన్ని సూచిస్తుంది. శక్తి, ఆసక్తి, ధైర్యం, పరాక్రమం. మొదలైనవి ద్రేక్కాణ కుండలి ద్వారా తెలుసుకోవచ్చు విశ్లేషణ కొరకు లగ్న కుండలి మరియు కుజుడి స్థితి మరియు 3 వ భావాన్ని తనిఖీ చెయ్యాలి.

*చతుర్థాంశ(D4) కుండలి*

చతుర్థాంశ మనకు కలిగే సౌకర్యాలు, గృహ వాహనాది యోగాలు, మన జీవితం కష్టాలతో కూడినదా లేక సుఖాలతో కూడినదా..తదితర అంశాల గురించి చెపుతుంది.

*సప్తాంశ(D7) కుండలి*
సప్తాంశ సంతానం గురించి అలాగే మనలో ఉండే సృజనాత్మక శక్తి గురించి చెపుతుంది.సంతానం,వంశోన్నతి,వంశాభివృద్ధి చూడవచ్చు

*దశమాంశ(D10) కుండలి*

దశమాంశ ఉద్యోగము మరియు కీర్తి ప్రతిష్టల గురించి తెలియ జేస్తుంది.కర్మలు,వాటి ఫలితాలు,ఉద్యోగం,గౌరవాలు,కీర్తిప్రతిష్ఠలు,వృత్తిలో ఒడిదుడుకులు తెలుసుకోవచ్చు.

*ద్వాదశాంశ(D12) కుండలి*

ద్వాదశాంశ మన అదృష్టం గురించి, పూర్వ జన్మలో మనం చేసిన కర్మ ఫలితాలను గురించి తెలియజేస్తుంది. అలాగే వంశ సంబంధ దోషాలను గురించి కూడా తెలియ జేస్తుంది.తల్లిదండ్రులతో అనుబందాలు,వారి నుండి వచ్చే అనారోగ్యాలు,ఎవరి నుండి ఎవరికి సుఖం ఉన్నదో తెలుసుకోవచ్చును.

*షోడశాంశ(D16) కుండలి*

షోడశాంశ మనకు గల గృహ, వాహనాది సౌఖ్యాలను గురించి తెలిసజేస్తుంది. అలాగే ఒక వ్యక్తి అంతర్గంతంగా ఎలాంటివాడో తెలుసుకోవటానికి ఇది ఉపయోగపడుతుంది.వాహనసౌఖ్యం,వాహనాలతో చేసే వృత్తి వ్యాపారాలు లాభిస్తాయో లేదో తెలుసుకోవచ్చును.వాహనానికి ఏరంగు మంచిదో తెలుసుకోవచ్చును.

*వింశాంశ(D20) కుండలి*

వింశాంశ మనం చేసే దైవారాధన, అనుకూల దైవం, గురూపదేశం తదితర ఆధ్యాత్మిక అంశాలను తెలియ జేస్తుంది. మనం ఏ దేవున్ని ఉపాసన చేయాలి అనేది దీని ద్వారా కనుక్కోవచ్చు.మంత్రోచ్చారణ ,దేవుడిని పూజించేటప్పుడు అడ్డంకులు వస్తాయో లేదో తెలుసుకోవచ్చును.వింశాంశలో శుక్రుడు బలహీనంగా ఉండాలి.బలహీనంగా ఉంటేనే సన్యాసియోగం వస్తుంది.అప్పుడే దైవచింతన చేయగలడు.

*చతుర్వింశాంశ(D24) కుండలి*

చతుర్వింశాంశ మన విద్యను గురించి ఆధ్యాత్మికతను గురించి తెలియజేస్తుంది.ఉన్నతవిద్య,విదేశి విద్య,విద్యలో ఆటంకాలు గురించి తెలుసుకోవచ్చు.

*సప్తవింశాంశ(D27) కుండలి*

సప్తవింశాంశ మన శారీరక, మానసిక శక్తియుక్తుల గురించి తెలియజేస్తుంది. అలాగే మన జీవితానికి సంబందించిన అంశాల సూక్ష్మపరిశీలనకు లగ్నకుండలితో పాటు దీన్ని కూడా పరిశీలించాలి.జాతకుడిలో ఉండే బలాలు,బలహీనతలు తెలుసుకోవచ్చును.

*త్రింశాంశ కుండలి(D30)*

త్రింశాంశ మన కష్ట, నష్టాలను గురించి, అనుకోకుండా వచ్చే ఆపదల గురించి, ప్రమాదాల గురించి తెలియజేస్తుంది.స్త్రీ పురుషుల శీలం,వ్యక్తి యొక్క అంతర్గత ఆలోచనలు,అరిష్టాలు తెలుసుకోవచ్చును.

*ఖవేదాంశ(D40) కుండలి*

ఖవేదాంశ జాతకాన్ని మరింత క్షుణ్ణంగా అధ్యయనం చేయటానికి, జాతకంలో కల శుభాశుభ అంశాలను తెలుసుకోవటానికి అలాగే మనకు కల అలవాట్లను, భావోద్వేగాలను అంచనా వేయటానికి ఉపయోగపడుతుంది.మాతృవంశం నుండి వచ్చే శుభ కర్మ,అశుభ కర్మ ఫలితాలను తెలుసుకోవచ్చును.

*అక్షవేదాంశ కుండలి(D45)*

అక్షవేదాంశ మనకుండే నైతిక విలువలను గురించి, జాతకానికి సంబంధించిన అంశాలను సూక్ష్మ పరిశీలన చేయటానికి ఉపయోగ పడుతుంది.తండ్రివంశం నుండి వచ్చే శుభ కర్మ,అశుభ కర్మ ఫలితాలను తెలుసుకోవచ్చును.

*షష్ట్యంశ కుండలి (D60)*

షష్ట్యంశ జాతకానికి సంబంధించి సూక్ష్మ పరిశీలనకు అలాగే కవలల జాతకాల పరిశీలన విషయంలో ఇది ఉపయోగపడుతుంది.పూర్వజన్మ విషయాలు,కవలల విశ్లేషణకు,ముహూర్తమునకు,ముహూర్త లగ్నం షష్ట్యంశలో మంచిగా ఉండాలి.

Monday, October 29, 2018

మీ పేరును బట్టి ఇంటి సింహ ద్వారమును ఎంచుకోవటం లేక ఏదిక్కు ఇల్లు మీకు అదృష్టాన్ని ఇస్తుందో తెలుసు కోవటం ఎలా ?

ఓం శ్రీ మహా గణపతయే నమః
House facing according to Name
ఉపోత్ఘాతం:- 

అతి ప్రాచీన మైన భారత దేశము శిల్ప కళలకు, వాస్తు వైభవం నకు ప్రఖ్యాతి వహించింది .
భారత దేశ నాగరికత అద్భుతమైన వాస్తు వైభవమునకు అద్దం పడుతుంది . భారత దేశం లోని
అన్ని గ్రామాలు , పట్టణాలు , మహా నగరాలు మహా సౌధాలు శిల్పకళలతో నిండి వాస్తు శాస్త్ర
విజ్ఞానాన్ని , మన పూర్వికుల శిల్పకళా మరియు నిర్మాణ సామర్ద్యాన్ని ప్రపంచానికి
చాటిచెబుతూ అందరిని అబ్బుర పరుస్తున్నాయి .

ఇలా పురములు,దివ్య సౌదములు మరియు సాధారణ గృహములు ఎన్నో కట్టడాలు
వస్తువులుగా తనయందు కలిగి వున్నది కావునే “ భూమికి “ దేవనాగరి యందు “ వాస్తు “
అని కూడా పేరుగలదు. అలాంటి ఎన్నో విషయములను తెలియజేయు విజ్ఞానమే “
వాస్తుశాస్త్రము “ అని పిలవబడినది.

“దిశ కుదిరి దశ కుదురు“ నను సామెత తెలిసిందే ! దిశ అనగా “ తాను నివసించు దిక్కు,
స్థలము,గృహము” అని అర్ధము! దశ అనగా జాతక రీత్యా ప్రాప్తించు అభివ్రుది, శుభ
యోగములు ! కనుక గృహనిర్మాణము తలపెట్టిన వారు శాస్త్ర సమ్మతముగా గృహం
నిర్మించుకోవాలి . నివసించే గ్రహము సొంతమైన కాక పోయిన అందు వసతులు నివసించు
వారు అనుబవించు నట్లు , అందలి దోషములను కూడా యజమానితో పంచుకోనవలసిందే.
అలాగే మంచిని కూడా నివాసము వుండే వారు యజమాని అనుభవిస్తారు .

ఎవరు జన్మించిన గృహము వారికి అత్యంత శుభము , కాని కొన్ని సందర్భాలలో వేరొక
ఇంటిలో నివసించ వలసి రావటం లేక నూతన గృహమును నిర్మించటం జరుగుతుంటుంది .
అలాంటి సందర్భములలో నిర్మించబోయే లేక నివసించబోయే గృహము మనకు మంచిదా ?
కదా ? అని తెలుసుకోనటాన్ని “ వాస్తుశాస్త్రం” లో అర్వణము అని అంటారు .


అర్వణము రెండు రకములుగా లెక్కించ వచ్చు 1. జన్మనక్షత్రము రీత్యా 2. నమనక్షత్రము రీత్యా .
నామ నక్షత్రమును బట్టి గృహము యొక్క సింహద్వారము ఎదిక్కున ఉండాలో నిర్ణయించటం
ఎక్కువగా వాడుకలో వున్నా శ్రేష్టమైన విడనంగా చెప్పవచ్చు. తెలుగు తమియ మలయాళ
కన్నడ రాష్ట్రాలలోని కొన్ని ప్రాంతాల వారు నక్షత్రాన్ని బట్టి మరియు రాశిని బట్టి కూడా
తెలుసుకుంటారు. కానీ ఈవిధానాలు అంత ఎక్కువ వాడుకలో లేక పోవటం గమనించ
వచ్చు. ముందుగా తన పేరునకు గల మొదటి అక్షరం ప్రకారం “దిశావర్గ” నిర్ణయం
చేసుకోవాలి. సాధారణం గా దంపతులు అనగా భార్య భర్తలు గృహ నిర్మాణం తలపెడితే
సింహద్వార నిర్ణయం ఇంటి యజమాని అనగా భర్త యొక్క పేరును బట్టి మాత్రమే చూడాలి.
భార్య భర్తల ఇద్దరి పేరుతో చూడవలసిన అవసరం లేదు అని గమనించ వచ్చు . భూమి భార్య
పేరున కొనుగోలు చేసినప్పటికీ భర్త యొక్క పేరును బట్టి మాత్రమే సింహ ద్వారం
నిర్ణయించాలి.

“దిశావర్గ” నిర్ణయం :- 

తెలుగు భాషలో మొత్తం అక్షరాలు 51 వున్నవి. వీటిని 8 భాగాలుగా విభజించినారు. వీటినే
“అష్టవర్గులు” అని పిలుస్తారు. ఈ విధానాన్ని సులువుగా అర్ధం చేసుకోవటానికి పైన
ఇవ్వబడిన పట్టికను గమనించ గలరు.

మొదటది “అ” వర్గు అని పేరు! అనగా ఈ వర్గులో “అ,ఆ,ఇ,ఈ,ఉ,ఊ,ఋ, ౠ,ఎ, ఏ, ఐ, ఒ,
ఓ,ఔ,అం,అః” అనే 16 అక్షరములు ఉండగలవు. వీటిలో ఎ అక్షరము తమ పేరునకు మొదట వున్నా
అట్టివారు “అ వర్గు” నకు చెందిన వారుగా పరిగణింప బడతారు. వీరికి “తూర్పు దిక్కు” స్వదిశ
అవుతుంది.

రెండవది “క” వర్గు అని పేరు! అనగా ఈ వర్గులో “క, ఖ, గ, ఘ, ఙ ” అనే 5 అక్షరములు
ఉండగలవు. వీటిలో ఎ అక్షరము తమ పేరునకు మొదట వున్నా అట్టివారు “క వర్గు” నకు చెందిన వారుగా
పరిగణింప బడతారు. వీరికి “ఆగ్నేయ దిక్కు” స్వదిశ అవుతుంది.

మూడవది “చ” వర్గు అని పేరు! అనగా ఈ వర్గులో “చ, ఛ, జ, ఝ, ఞ” అనే 5 అక్షరములు
ఉండగలవు. వీటిలో ఎ అక్షరము తమ పేరునకు మొదట వున్నా అట్టివారు “చ వర్గు” నకు చెందిన వారుగా పరిగణింప బడతారు. వీరికి “దక్షిణదిక్కు” స్వదిశ అవుతుంది.

నాల్గవది “ట” వర్గు అని పేరు! అనగా ఈ వర్గులో “ట, ఠ, డ, ఢ, ణ” అనే 5 అక్షరములు
ఉండగలవు. వీటిలో ఎ అక్షరము తమ పేరునకు మొదట వున్నా అట్టివారు “ట వర్గు” నకు చెందిన వారుగా పరిగణింప బడతారు. వీరికి “ నైరుతి దిక్కు” స్వదిశ అవుతుంది.

ఐదవది “త” వర్గు అని పేరు! అనగా ఈ వర్గులో “త, థ, ద, ధ, న” అనే 5 అక్షరములు
ఉండగలవు. వీటిలో ఎ అక్షరము తమ పేరునకు మొదట వున్నా అట్టివారు “త వర్గు” నకు చెందిన వారుగా పరిగణింప బడతారు. వీరికి “ పడమర దిక్కు” స్వదిశ అవుతుంది.

ఆరవది “ప” వర్గు అని పేరు! అనగా ఈ వర్గులో “ప, ఫ, బ, భ, మ” అనే 5 అక్షరములు
ఉండగలవు. వీటిలో ఎ అక్షరము తమ పేరునకు మొదట వున్నా అట్టివారు “ప వర్గు” నకు చెందిన వారుగా పరిగణింప బడతారు. వీరికి “ వాయవ్య దిక్కు” స్వదిశ అవుతుంది.

ఏడవది “య” వర్గు అని పేరు! అనగా ఈ వర్గులో “య, ర, ల, వ” అనే 4 అక్షరములు
ఉండగలవు. వీటిలో ఎ అక్షరము తమ పేరునకు మొదట వున్నా అట్టివారు “య వర్గు” నకు చెందిన వారుగా పరిగణింప బడతారు. వీరికి “ ఉత్తర దిక్కు” స్వదిశ అవుతుంది.

ఎనిమిదవది “శ” వర్గు అని పేరు! అనగా ఈ వర్గులో “శ, ష, స, హ, ళ, క్ష” అనే 6 అక్షరములు
ఉండగలవు. వీటిలో ఎ అక్షరము తమ పేరునకు మొదట వున్నా అట్టివారు “శ వర్గు” నకు చెందిన వారుగా పరిగణింప బడతారు. వీరికి “ ఈశాన్య దిక్కు” స్వదిశ అవుతుంది.

ఈ ప్రకారముగా వారి వారి పేరును బట్టి వారు ఏ వర్గమునకు చెందిన వారో తెలుసు కోవాలి. తద్వారా సింహద్వారము దిశను నిర్ణయించు కోవాలి.

“దిశావర్గ ఫలితములు”

ప్రతి వారికి వారి జన్మ గృహము శుభము , తన జన్మ గృహము కాక మరియే ఇతర కారణముల వల్లనైన ఇంకో గృహమున నివసించ వలసివచ్చిన తప్పక “ సింహద్వారం దిశను” శాస్త్రరిత్య నిర్ణయించు కొనినివసించుట అత్యంత శుభము!

తన స్వదిశ లో సింహద్వారము ఉండుట అత్యంత శుభము. స్వదిశ మొదలుకొని 1,3,7 దిశలు కూడాఅత్యంత శుభములే. 2,4,6 దిశలు మద్యమ లేక మిశ్రమ ఫలితాన్ని ఇస్తాయి. 5,8 దిశలు ఎంచు కొనిన బాధలు, ఇబ్బందులు, చింతలు, ధనవ్యయం,అనారోగ్యం అధికమగును! తద్వారా దరిద్రమును అనుబవించ వలసి వచ్చును.ఫలితములు వరుసగా

స్వదిశ అనగా 1)పుష్టి 2) సమం 3) మిత్ర 4)సమం 5)శత్రు 6)సౌఖ్యం 7)భోగం 8)వ్యయం. 

వీలైనంత వరకు విదిక్కులు లైన “ ఆగ్నేయం,నైరుతి,వాయవ్యం,ఈశాన్యం” లకు సింహద్వారము ఉండకుండా చూచుట శుభము . గృహమునకు “గేహము” అని పేరు వున్నది! వాస్తు పురుషుని స్వరూపము మనవ దేహము లాంటిది. అందుకు వాస్తుపురుషుని పూజ అంటే తనచే కట్టబడిన గృహమునకు పూజ అని అర్ధము .

 “ సర్వాంగే నయనం ప్రధానం “ అనగా అన్ని దేహ అంగములలో కళ్ళు ప్రధానమైనవి అదే విధంగ “ గేహన్గే సింహ ద్వారం ప్రధానం” అంటే ఇంటికి సింహద్వారం చాలా ప్రధానంఅని అర్ధం.

“ గృహస్తస్య సర్వ క్రియాన సిద్యంతి గృహం వినా” అని శాస్త్ర వాక్యము. అనగా స్వగృహము లేకుండాపరుల గృహములలో ఎన్నాళ్ళు ఎన్ని సత్కర్మలు ఆచరించిన పరిపూర్ణముగా సిద్ధిoచవు. ఆ సత్కర్మల ఫలితమును సంపూర్ణముగా పొందుట కష్టసాద్యము . అందుకే చిన్నదో పెద్దదో తమది అనే ఒక గృహము చాలా అవసరము !

ఇహ పరములకు సాధనము గృహము. చెడు పాత్రలో కాచిన పాలు విరిగి పోయిన విధముగా, చవిటి నెలలో వేసిన పంట పండ నట్లు , వాస్తు సరిలేని గృహమునందు నివాసము నిష్ప్రయోజనం . గృహమునకు సింహద్వారము యెంత ప్రధానమో , గృహము శల్య వాస్తు మరియు ఇంటి లోపల వున్న గదుల నిర్మాణము వాటి స్థితి కూడా అంతే ప్రధానము. కావున తామందరూ శాస్త్రపరిజ్ఞాన సహాయతతో అందమైన,శుభ వాస్తు పరమైన గృహములను నిర్మించుకొని ఉత్తమ ఫలితాలను పొందాలని ఈశ్వరుని ప్రార్ధిస్తూ ..

మీ
భువనగిరి మురళీ కృష్ణ శర్మ ( శర్మాజీ )
నార్త్ కరోలిన, అమెరికా.