Friday, April 10, 2020

Life History of Sri Tadepalli Raghava Narayana Sastry Garu, popularly called as Chandolu Sastry Garu.

🌺 చందోలు మహర్షులుగా ప్రసిద్ధి గాంచిన బ్రహ్మీభూతులు శ్రీ తాడేపల్లి రాఘవ నారాయణ శాస్త్రిగారి సమగ్ర జీవిత విశేషాలు🌺

బాలా త్రిపుర సుందరి అమ్మ వారి స్వరూపం


చందవోలు గ్రామంలో తాడేపల్లి వెంకటప్పయ్య శాస్త్రి, హనుమమ్మ దంపతులకు రాఘవనారాయణ శాస్త్రి గారు జన్మించారు. తాడేపల్లి వెంకటప్పయ్య శాస్త్రి గారు 1922లో శ్రీ కాకాని మల్లీశ్వర మాహాత్యము ప్రబంధాన్ని వ్రాసి ప్రచురించారు. తిరిగి 1986లో తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారు  రామకథామృత గ్రంథమాల తరఫున పునర్ముద్రించారు

విద్యాభ్యాసం

రాఘవ నారాయణశాస్త్రికి ఎనిమిది సంవత్సరాల వయసు రాగానే తండ్రి వెంకటప్పయ్యశాస్త్రి ఉపనయనం చేశారు  వెంకటప్పయ్యశాస్త్రి వద్దనే రాఘవనారాయణశాస్త్రి సంస్కృతాంధ్ర సాహిత్యాలు చదువుకోవడం ప్రారంభించారు. విద్యాభ్యాసాన్ని తీవ్రమైన ఏకాగ్రత, నిష్టతో చేయడం ప్రారంభించారు. విద్యాభ్యాస కాలం నుంచే త్రికాల సంధ్యావందనం, అగ్నికార్యం సకాలంలో చేయడం ప్రారంబించి, సంప్రదాయానుసారం, శాస్త్రానుసారం వచ్చిన విధులన్నీ పాటించేవారు. అయితే వీరిచేత అక్షరాభ్యాసం చేయించి, లౌకిక విద్య  తాడికొండ గ్రామస్తులైన కేదారలింగం నేర్పడం ప్రారంభించారు. ఆయన బాలాత్రిపురసుందరీ ఉపాసకులు. 12వ సంవత్సరంలోనే రాఘవనారాయణశాస్త్రికి వెంకటప్పయ్యశాస్త్రి అనుమతితో కేదారలింగం "బాలా త్రిపుర సుందరి మంత్రాన్ని" ఇచ్చారు. బాల ఉపాసన 16 సంవత్సరాల వయసుకే పండి జీవితాంతం అమ్మవారు పిలిస్తే పలికే దైవంగా నిలిచింది. దెందుకూరి పానకాల శాస్త్రి వద్ద తర్కం, పొదిలి సీతారామశాస్త్రి వద్ద మంత్రానుష్ఠానం నేర్చారు.

సన్యసించేందుకు ప్రయత్నాలు, వివాహం

రాఘవనారాయణశాస్త్రికి యవ్వనంలోనే సన్యసించాలనే కోరిక కలిగింది. సన్యసించేందుకు తల్లి అనుమతి తప్పనిసరి కాగా ఆమె రాఘవనారాయణశాస్త్రి సన్యసించేందుకు అనుమతినివ్వలేదు. కుమారుడు సన్యసించడాన్ని వెంకటప్పయ్యశాస్త్రి కూడా వ్యతిరేకించారు. అయితే కొన్నాళ్ళకు వెంకటప్పయ్యశాస్త్రికి కుమారుడు కనిపించక వెతుకుతూండగా ఊరి చివర పొదలమాటున నిర్వికల్ప సమాధిలో తపస్సు చేసుకుంటున్న రాఘవనారాయణశాస్త్రి కనిపించారు. తన కొడుకు వైరాగ్యం ఏ స్థాయిలో ఉందో తెలిసివచ్చింది. శ్యామలాంబ అనే యోగిని వీరి తండ్రి గారితో శాస్త్రి గారు సూర్య మండలాన్తర్వర్తి అయిన మహా సిద్ధుడు ఈ రూపంలో జన్మించాడని చెప్పింది. శాస్త్రి గారికి చిన్నతనంలో పిన తల్లి చూపించిన ఒక దృశ్యం గోచరించింది. అందులో తాను ఒక సిద్ధుడు శ్రీ చక్రేశ్వారి అయిన కామేశ్వరి దూరంగా ఉన్న యువతుల్ని తీసుకు రమ్మన్నది. ఒకరిని మోసుకొని ఇద్దర్నీ తీసుకొచ్చాడు. అమ్మవారు చిరునవ్వుతో అతని మనసు కొంచెం చలించింది అని భూలోకంలో జన్మించమని తాను మోసుకొచ్చిన అమ్మాయే భార్య అవుతుందని అన్నది. 19 వ ఏట అద్దేపల్లి మంగమ్మ, పాపయ్య శాస్త్రుల కూతురు పార్వతితో వివాహ మైంది. పిన్ని చూపించింది కూడా ఈమెనే. ఆమె పేరును శ్రీదేవిగా శాస్త్రిగారు మార్చారు.

పాండిత్యం
శాస్త్రి గారు తండ్రి గారి వేద పాఠశాల నిర్వహణలో తోడు పడుతూ ఉన్నారు. ఆయన పద్ధతి నచ్చిన చాలా మంది అమెరికాకు రమ్మన్నారు. వారికి ఇష్టం లేదు. పిన పాటి వీరభద్రయ్యతో నేత్రావధానం, ఎలేశ్వరపు పురుషోత్తమ శాస్త్రితో కవిత్వ సాధన చేశారు. అప్పటికే అనేక సభల వారు శాస్త్రి గారికి 400 కు పైగా సర్టి ఫికేట్స్ ఇచ్చారు. వ్యాకరణ గురువు గారు ముదిగొండ నాగలింగ శాస్త్రి గారితో అనేక అవధానాలు చేసి, ఆ డబ్బు అంతా గురువు గారికే సమర్పించారు. పుష్పగిరి పీఠాధిపతులు శ్రీ చంద్ర శేఖర భారతీ స్వామి సన్నిధిలో జరిగిన అష్టావదానికి వారు మెచ్చి ఉభయ శ్లేషకు లక్ష్యంగా ఒక శ్లోకం చెప్ప మంటే ఆశువుగా అద్భుతంగా చెప్పి ఒప్పించారు.

అమ్మ వారి సాక్షాత్కారం
దేశ సంచారం చేస్తూ ఒక సారి ఇంటికి వస్తే ఇల్లు ‘’అయ్యవారి నట్టిల్లు ‘’లా ఉంది. ఇంటి వద్దే ఉండి తండ్రికి తోడ్పడ్డారు. తిండికి గడవని పరిస్థితి. మూడు రోజులు అంతా ఉపవాసమే. మూడవ రోజు రాత్రి 27 సార్లు లలితా సహస్ర నామ పూజ చేసి నైవేద్యం పెట్టిన జలాన్నే త్రాగి అన్గోస్త్రం నేల మీద పరచి నిద్ర పోయారు. 10 ఏళ్ళ బాలిక కలలో కన్పించి ‘’ఒర్ ! ముష్టి పెడతాను. కొంగు పట్టు ‘’అన్నది. దోసెడు బియ్యం కొంగు లో పోసి ‘’బండి వస్తుంది. అందులో కావలసిన సామగ్రి అంతా వస్తుంది ‘’అన్నది. తెల్లారే సరికి ఖాజీ పాలెం సీతా రామ రాజుగారి బండి వచ్చింది. అక్కడ రాజు గారు కోరిన మీదట పురాణం చెప్పి రాత్రి ఇంటికి వచ్చే సరికి తలుపు దగ్గర రాజు గారు పోయించిన పుట్టెడు ధాన్యపు రాశి కన్పించింది. అప్పటి నుంచి శాస్త్రి గారింట లక్ష్మీ దేవి నిత్య సాక్షాత్కారమే.
అనేక గ్రామాలలో భాగవతం, హరి వంశం, పురాణం చెబుతూ రాత్రికి ఇంటికి చేరేవారు. పరమ నిష్టాగరిష్టంగా జీవించేవారు. ప్రాణాయామం తపస్సు కొనసాగించారు. ఇంట్లో వేరుసెనగ నూనె, వేరుసెనగ వాడలేదు. దొండకాయ, టమేటా, బంగాళా దుంప, ముల్లంగి కాబేజీ నిషిద్ధం. కాశీకి తప్ప ఎప్పుడూ రైలు ప్రయాణం చేయలేదు. ఆయనకు మగ సంతానం లేదు. కూతురు లక్ష్మిని చెరువు సత్య నారాయణ శాస్త్రి కిచ్చి వివాహం చేశారు. ఆయనే శాస్త్రి గారి జీవిత చరిత్ర రాశారు.

అష్ట సిద్దులు కైవసం
శాస్త్రి గారికి అష్ట సిద్ధులు వశమైనాయి. వాటిని స్వంతానికి ఎప్పుడూ వాడుకోలేదు. వారు చాలా గొప్ప తపశ్శక్తి సంపన్నులు. ఆ తపస్సు ఈ ఒక్క జన్మలోనిది కాదు. ఎన్నెన్నో జన్మలలో చేసిన తపస్సంతా కలిసి ఆయన ఆ స్థితిలో ఉండేవారు. దేవతా శక్తులన్నీ వారి చుట్టూ ఎప్పుడూ తిరుగుతూ ఉండేవి. అన్ని దైవ శక్తులు ఎల్లప్పుడూ వారి అధీనంలో ఉండేవి. కానీ వారెన్నడూ వాటిని తన స్వార్థానికి వినియోగించుకోలేదు. అమ్మవారు వారిని అనేక సార్లు "నీకు ఏమి కావాలో చెప్పు. ఐశ్వర్యం, చక్రవర్తిత్వం, దాసదాసీలు, ఏనుగులు, సంపదలు, కీర్తి ఏమి కావాలన్నా ప్రసాదిస్తాను కోరుకో" అనేది. వారు "నువ్వే నాతో ఉన్నప్పుడు అవన్నీ నాకెందుకమ్మా" అనేవారు. పూర్తి నిష్కామంగా జీవితమంతా గడిపారు వారు ఆయుర్వేద వైద్యం చేసేవారు. దాని అధ్యయనంలో భాగంగా వారికి ’వశ్యంకర ఔషధి ‘’ని ఒక మూలిక గురించి తెలిసింది. అది కేవలం గ్రహణ సమయంలో మాత్రమే కంటికి కనిపించే మూలిక. అది కూడా ఒక నిర్ణీత స్థలంలో మాత్రమే లభ్యమవుతుంది. ఈ విషయం తెలుసుకున్న శాస్త్రి గారు అది దగ్గరలోని ఒక కొండ మీద లభిస్తుందని తెలుసుకుని ఒక గ్రహణ సమయానికి ఆ కొండ మీదకి వెళ్ళారు. సరిగ్గా గ్రహణం ఆరంభం కాగానే ఆ మూలిక వారికి కనిపించింది. పరమానందంతో వారు దానిని సమీపించి కోసుకోబోతుండగా అక్కడ ఒక చిన్న పిల్లవాడు అడ్డు వచ్చాడు. సరేలే అని వారు వేరే వైపు నుంచి వచ్చి దానిని కోసుకుందామనుకుంటే ఆ పిల్లవాడు ఆ వైపు కూడా అడ్డు వచ్చాడు. అలా ఏ వైపు చూస్తే ఆ వైపు ఆ పిల్లవాడు అడ్డు వస్తుండడంతో వారికి ఆ మూలిక కోసుకోవడం కుదరడం లేదు. ఇక విసిగిపోయిన వారు "ఎవడవురా నువ్వు? నాకెందుకు అడ్డు వస్తున్నావు? నన్ను ఆ మూలిక కోసుకోనీ. మరల గ్రహణం అయిపోతే అది కనిపించదు" అన్నారట. ఆ పిల్లవాడు "నేనెవరైతే నీకెందుకు? నీకు ఆ మూలిక ఎందుకు?" అని ప్రశ్నించాడు. "ఆ మూలిక మన దగ్గర ఉంటే మనకు విశ్వమంతా వశమవుతుందట. కనుక నన్ను దానిని తీసుకోనీ" అని శాస్త్రి గారన్నారు. దానికి అ పిల్లవాడు నవ్వి "‘’నీకు ఈ మొక్క తో పని లేదు. నీ ముఖం చూస్తేనే అందరు వశు లౌతారు ‘’ఆ మూలిక లేకుండానే నీకు విశ్వం వశమైందిగా" అన్నాడట. శాస్త్రి గారు "అదంతా నీకెందుకు? ముందు అడ్డు తొలగు. మరల గ్రహణం అయిపోతే నాకు అవకాశం చేజారిపోతుంది" అని కోరారు. కానీ పిల్లవాడు ఒప్పుకోలేదు. ఈ లోగా గ్రహణం పూర్తయిపోయింది, ఆ మూలిక మాయమైపోయింది. బాలుడు మాయమయ్యాడు శాస్త్రి గారు తనకు దాన్ని పొందే యోగం లేదని నిట్టూరుస్తూ ఉండగా ఆ పిల్లవాడు మూడు ముఖాలతో దత్తాత్రేయ స్వామిగా దర్శనమిచ్చాడు. కారణం ఆ మూలికకు అధిదేవత దత్తాత్రేయస్వామి.. వీరు వేరే గ్రామంలో అధ్యయనం నిమిత్తం కొన్ని రోజులు ఉన్నప్పుడు ఒక సారి ఒక 6-7 యేళ్ళ పిల్లవాడు వీరిని చూచి "మనిద్దరం కలిసి ఫలానా కొండ మీద 20 సంవత్సరాలు తపస్సు చేసుకున్నాం కదా! గుర్తు లేదా?" అని అడిగాడట. వీరికేమీ అర్థం కాక ఏ కొండ మీద, ఎప్పుడు, ఎవరు అని ఏదో అడుగబోతుండగా ఆ పిల్లవాడు పారిపోయాడట. అంటే వాడు ఏ జన్మలో వారి తపస్సాహచర్యం పొందిన మహా భాగ్యశాలియో కదా! పూర్వ జన్మ సఖుడైన ఒక యోగి కన్పించి సుఖ దుఃఖాలను సమానం గా భావించాలని చెప్పి మళ్ళీ 50 ఏళ్ళ కు కని పిస్తానని చెప్పి వెళ్లాడు. సరిగ్గా యాభై ఏళ్ళ తరువాత శాస్త్రి గారు అమరావతి వెళ్లి అమరేశ్వర స్వామిని దర్శించి తమ గదిలో ప్రాణాయామం చేస్తూ చాలా పైకి లేచి తల క్రిందులు గా పడి పోతుంటే తల నే లకు తగిలే సమయాన ఆయోగి వచ్చి చేయి అడ్డం పెట్టి కాపాడాడు. శాస్త్రి గారు నమస్కరించ గానే యోగి అదృష్యుడైనాడు.
తండ్రి గారు మొదలు పెట్టిన ‘’శ్రీ రామ కదామృతం ‘’ను వారి మరణానంతరం శాస్త్రి గారు పూర్తీ చేస్తున్నారు అయోధ్యా కాండం లో గాయత్రీ మంత్రం లోని ‘’భకార’’వర్ణం తో పద్యం రావటం లేదు. అమ్మను ఉపాశించి నిద్ర పోయారు. కలలో ఒక బీబీ జగన్మోహిని నిద్రిస్తుండగా 30ఏళ్ళ గడ్డం వాడొకడు ఆమె చొక్కా పైకెత్తి పాలు తాగుతున్నాడు. శాస్త్రి గారు ఆ దృశ్యం చూస్తుంటే ‘’ఎందుకు నిల బడ్డావు ‘’?అని అడిగింది. ’’నాకూ పాలు ఇస్తావా ?’’అని అడిగారు. మెలకువ వచ్చి ‘’భర్మ మయ రమ్య హర్మ్యము ‘’అనే భ వర్ణం తో పద్యం తేలిగ్గా వచ్చింది
తాడి కొండ వేద పాథ శాలలో దేయాలు తిరిగి ఇబ్బంది పెడుతుంటే శాస్త్రి గారు మంత్రం పఠించి పార ద్రోలారు. ఒక సారి పుస్తక ముద్రణ కోసం చందాలకు తిరుగుతూ ఉంటె సత్తెనపల్లి లో ఒక బ్రాహ్మణుల ఇంట్లోకి ఇరవైయేళ్ళ యువతీ కని పించి, నమస్కరించి లోపలి వెళ్ళింది. ఆమె గ్రహ పీడి తురాలు. అందర్ని కొడుతూ, తిడుతూ ఉండేది. అలాంటిది శాస్త్రి గారిని చూడగానే అత్యంత వినయాన్ని ప్రదర్శించటం ఇంట్లో వారందరికి ఆశ్చర్యం కలిగించింది. ఆమెను గ్రహ ప్రేరణ చేసి ‘’ఏం చేస్తే నువ్వు పోతావు /’’అని అడిగారు. ’’సహస్ర గాయత్రీ జప ఫలం ధార పోస్తే పోతాను ‘’అంది. శాస్త్రి గారు సహస్ర గాయత్రి జపం చేసి ధార పోశారు. ఇంటి ముందున్న వేప చెట్టు కొమ్మ విరిగి పడింది. దెయ్యం వదిలింది. వేరొక సారి నాగుల చవితి రోజు కాలవ లో స్నానం చేసి వస్తుంటే నాగలి చాలులో పడుకొన్న నాగు పాము తోక పై ఆయన కాలు పడింది. అది బుసలు కొడుతూ పైకి లేచి కాటు వెయ బూనితే ‘’గారుడ మంత్రం ‘’జపించారు. సర్పం తల నేల కు వాల్చింది. ’’స్వామీ !నీ జోలికి నేను రాలేదు. నా జోలికి నువ్వు రావద్దు. పొరపాటున నా కాలు తగిలింది. వెళ్లి పొండి ‘’ అనగానే పాము వెళ్లి పోయింది. ఆ రోజంతా గారుడ మంత్రం పఠిస్తూనే ఉన్నారు.
శాస్త్రి గారు 90 ఏళ్ళ జీవిత కాలం లో 80 ఏళ్ళు ‘’బాలా మంత్రానుష్టానం ‘’చేసిన మహనీయులు. ఒక సారి కాశీ లో గంగా స్నానం చేస్తుంటే గంగా దేవి’గలగలా లాడే బంగారు చ్గాజులున్న చెయ్యి చూపించి ‘’నాకేమి కానుక తెచ్చావు ?’’అని అడిగింది. శాస్త్ర్రి గారికి ఏమీ పాలు పోక తన వ్రేలికున్న బంగారు దర్భ ఉంగరం తీసి ఆమె చేతి లో పెట్టారు. బసకు తిరిగి వచ్చి దేవతార్చన పెట్టె తెరిస్తే గంగకు అర్పించిన ఉంగరం అందులోనే ఉంది. తానేమైనా పొరపడి దర్భ ఉంగరం ఇవ్వలేదా అని సందేహించి ధ్యాన నిమగ్న మయ్యారు.. గంగమ్మ కని పించి ‘’కానుక ఇమ్మంటే దర్భ ఉంగరం ఇచ్చా వేరా ?’’అన్నది. ’’అది నీకు పితృ తర్పణం చెయ్యటానికి ఉప యోగ పడుతుంది కాని నాకు ఆభరణం ఎలా అవుతుంది ?’’అని గద్దించింది. ’’అమ్మా నేనేమీ నీ కోసం తేలేదు. ఆ సమయానికి అది స్పురించి ఇచ్చానంతే. ’’అన్నారు. మళ్ళీ గంగమ్మ ‘’నీ భార్యదగ్గర నాకోసం తెచ్చిన నగ ఉంది అది తెచ్చివ్వు ‘’అన్నది గంగ. శాస్త్రి గారు భార్యను అడిగి నగను తీసుకొని పోయి ‘’గంగార్పణం ‘’చేశారు.
ఆయన తన కార్య క్రమాలన్ని ముగించుకొని వాకిలి అరుగు మీద కూర్చుంటే వందలాది మంది వచ్చి తమకు ముహూర్తం పెట్టమనో, పేరు పెట్టమనో అడిగే వారు. కాసేపు కళ్ళు మూసుకొని ముహూర్త నిర్ణయం చేసే వారు. అంతే. ఆ కార్య క్రమం శుభప్రదంగా జరిగి పోయేది. దానికి తిరుగు లేదు. అదీ వారి మంత్ర సిద్ధి.
దాదాపు ముప్ఫై ఏళ్ళ క్రితం కాంచీ పరమాచార్యులు ఉయ్యూరు కే’సి’పి’వారి ఆహ్వానం, గురజాడ లోని చల్లా శర్మ గారు ఏర్పాటు చేసిన కార్య క్రమం లో వారం రోజులున్నారు. అప్పుడు రాఘవ శాస్త్రి గారు ఇక్కడే ఉన్నారు అన్ని రోజులు. అప్పుడు వారిని చూశాను. జగద్గురువుల ను వీరినీ ఒకే సారి చూసే భాగ్యం కలిగింది. అప్పుడే ‘’నడయాడే దైవం ‘’అని పరమా చార్య మీద పుస్తకం ఆవిష్కరణ జరిగి నట్లు జ్ఞాపకం.

తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రిగారు బయటకు వస్తే గృహస్థాశ్రమ ధర్మపు ఆచారం పాడైపోతుందని బాధపడేవారు. అప్పుడు పరమాచార్య స్వామివారు బ్రహ్మరథం(వేదం చదువుకున్న వారు మోసే పల్లకి) ఎక్కి శాస్త్రిగారి ఇంటికి వచ్చారు. వారింట్లో దిగి పరమాచార్య స్వామి వారు శాస్త్రిగారితో, “ఏమి నీ ఆచారానికి ఇబ్బంది వస్తోదని బెంగ పెట్టుకుంటున్నావా? ఇవ్వాళ మీ ఆచరానికి మేము కొత్తగా రక్ష కడుతున్నాం. ఇక నీకు ఇబ్బంది కలగదని” శాలువా తీసి కప్పారు.

పరమాచార్య స్వామి వారు శాలువా కప్పడము అంటే అంగరక్ష కట్టినట్టే. “ఇంక నీకు బెంగ లేదు. ఇప్పుడు బయటకు వచ్చినా ఏమి ఇబ్బంది కలగదు” అని అన్నారు. ఆ గురు శిష్యుల సంబధం అటువంటిది.

పరమాచార్య స్వామి వారు కూర్చొని ఉండగా శాస్త్రిగారు వారి తండ్రిగారైన కీర్తి శేషులు తాడేపల్లి వెంకటప్పయ్యశాస్త్రులు గారు ‘రామ కథామృతము’ అనే గ్రంథం రచించారు. దాన్ని స్వామి వారి ముందు చదువుదామని శాస్త్రి గారు వెళ్ళారు. పరమాచార్య స్వామి వారు లోపలికి రమ్మన్నారు. శాస్త్రిగారు ఆ పుస్తకాన్ని చదువుతున్నారు.

పరమాచార్య స్వామి వారు “పద్యాలు చాలా బాఉన్నాయి. చదువు చదువు” అని అంటున్నారు. ఇంతలో స్వామి వారి సేవకులొకరు వచ్చి “పెరియావ బెంగళూరు నుండి ఒకరు వచ్చారు. పీఠానికి ఇవ్వాలని చాలా డబ్బు తెచ్చారు. మీ దర్శనం చేసుకుని డబ్బు ఇచ్చి వెడతాము అని అంటున్నారు” అని చెప్పాడు. స్వామి వారు అతనితో కాసేపాగమను అని నువ్వు చదువు అని శాస్త్రిగారిని అన్నారు.

సేవకుడు మరలా వచ్చి “వారికి ఏదో పని ఉన్నది కావున తొందరగా మీ దర్శనం చేసుకొని వెళ్ళలాట” అని చెప్పాడు. కాని స్వామి వారు ఏమి మాట్లాడక శాస్త్రి గారి వైపు తిరిగి చదువు అని అన్నారు. సేవకులు మరలా వచ్చి అదే విషయం చెప్పారు. “ఆ బెంగళూరు ఆయనకు ఏదో పని ఉన్నదట. మీరు ఒక్కసారి దర్శనం ఇస్తే చూసి డబ్బిచ్చి వెళ్ళిపోతాడట. వారిని పంపమంటారా?”.

ఈ విషయాన్నంతా చూసి, శాస్త్రి గారు “అరే ఏమిటిది నేను ఇలా కూర్చుని పద్యాలు చదువుతూ ఉండడం వల్ల స్వామి వారికి ఇబ్బంది కలుగుతున్నట్టు ఉంది” అని లోలోపల బాధపడుతున్నారు.

అప్పుడు పరమాచార్య స్వామి వారు ఆ సేవకులతో, “అతను డబ్బు తెచ్చాడని అతనితో ముందు మాట్లాడాలా? లేక రామాయణం కన్నా అతను వచ్చి మాట్లాడడం గొప్ప అని అనుకుంటున్నాడా? నన్ను దర్శనం చెయ్యాలనుకుంటే తరువాత రమ్మను లేదా వేచి ఉండమను. నాకు ఈ రామాయణమే గొప్పది” అని అన్నారు.

శాస్త్రి గారి తండ్రి గారు వ్రాసిన ఆ రామాయణం ఎందుకు గొప్పదో లోకానికి తెలియజెప్పాలని అనుకున్నారు స్వామి వారు. శాస్త్రిగారిని ఇలా అడిగారు.

”ఏమయ్యా రాముడు సీతమ్మ తల్లితో అగ్నిప్రవేశం చెయ్యంచాడు కదా. సీత అగ్నిపునీత అని తెలుసు కదా! ఇంత తెలిసిన తరువాత కూడా ఎవరో ఎక్కడో ఒక పౌరుడు ఏదో నింద చేసాడని సీతని పరిత్యజించడం న్యాయమా? సరే రాజారాముడు చిన్న అవమానం వచ్చినా ఆ పదవిలో కూర్చోవడానికి ఇష్టపడడు అందుకే పరిత్యజించాడు అని వాల్మీకి చెప్పాడు. ఎందరో కవులు కూడా అదే చెప్పారు. నేను ఎనభై రామాయణాలు (వాల్మీకి రామాయణం , కంబ రామాయణం, భాస్కర రామాయణం, హనుమద్ రామాయణం, ఆధ్యాత్మ రామాయణం, మొల్ల రామాయణం మొ||) చెదివాను. ఒక్కొక్క కవి ఒక్కొక్కరకంగా చెప్పారు. మరి మీ నాన్న గారు ఈ విషయాన్ని ఎలా సమర్థించారు?” అని అడిగారు.

శాస్త్రి గారు ఆ ఘట్టం తీసి, ఇలా వివరణ ఇచ్చారు “రాముడు సీతమ్మ తల్లిని రాజు కాకముందు పెళ్ళి చేసుకున్నాడు. అప్పడి రాముడు రాజకుమారుడు అంతే. యుద్ధం తరువాత సీత అగ్నిపునీత అని లోకానికి చాటి పట్టాభిషేకం చేసుకున్నాడు. ఒకనాడు మంత్రులలో ప్రభువుకు నీతి పాఠం చెప్పే మంత్రి వచ్చి రాముడు ఏకాంతలో ఉండగా,

“ప్రభూ! మీరు వైకుంఠంలో ఉన్న శ్రీమన్నారాయణుడు. లోకానికి ధర్మం నేర్పడానికి రామచంద్రమూర్తిగా వచ్చి నరుడిగా ఈ భూమిపై నడుస్తున్నారు. ఇటువంటి మీరు ప్రభువు కాకముందు సీతమ్మను భర్యగా ఉంచుకున్నారు. ధర్మానికి తప్పులేదు. ప్రభువయ్యాక సీతమ్మ భార్యగా ఉండవచ్చా?” అని అడిగారు.

“ఎందుకుండకూడదు?” అని అడిగారు రాములవారు. అందుకు మంత్రి, “ప్రభువు భూమిపతి. అంటే ఈ భూమికి భర్త. మరి అప్పుడు భూమాత తనయ సీతమ్మ మీకు ఏమవుతుంది? మీరు రాజారాముడయ్యాక మీరు ఏకపత్నీవ్రతుడు కాబట్టి భూమికి మాత్రమే భర్తగా ఉండాలి. మరి ఇప్పుడు ధర్మం నిలిచిందా?” అని అడిగాడు. ఉలిక్కిపడిన రాముడు కారణం చెప్తూ ధర్మం కోసమే సీతమ్మను అడవికి పంపించాడు రాముడు” అని చెప్పారండి మా నాన్న గారు అని అన్నారు.

ఈ మాటలు విని పరమాచార్య స్వామి వారు పరవశించిపోయారు. ఇన్ని రామాయణాలు విన్నాను గాని ఇలా సమర్థించిన వాణ్ణి వినలేదు అని “ఆ పుస్తకాల సెట్టు ఒకటి అక్కడ పెట్టిపో” అన్నారు. ”తమకు నాగర లిపి వచ్చు. అరవ లిపి వచ్చు. మరి తెలుగు లిపి పరిచయమేనా?” అని శాస్త్రి గారు అడిగారు. ”నాకు అక్షరాలు వస్తేనేమి, రాకపోతేనేమి? పుస్తకాలు పెట్టి పూజ చేస్తాను. ఒక సెట్టు ఇవ్వు” అన్నారు. తరువాత కొంత కాలానికి శాస్త్రి గారు పరమాచార్య స్వామి వారి దర్శనానికి వెళ్ళారు. స్వామి వారు ఒకగంటసేపు పురాణం చేసారు. తరువాత స్వామి వారు ఈ కింది పద్యం చదివారు.

కనుమీ నీ నగుమోము మేల్సిరికి లక్ష్యం బౌటకున్ ల
జ్జెనెట్టగ మున్మున్న మునింగి కొండచరిబాటం జారె రేరేడటం
చనుమోదించుట బద్మినీపతి నిజుస్య స్మేర దృష్టి ప్రసా
ర నవోల్లాసిత హ్రీణయై తెలిపెడిన్, రామా! జగన్మోహనా!!

ఇది శాస్త్రి గారి తండ్రి గారు వ్రాసిన ‘రామ కథామృతము’లో బాలకాండ, నవమాశ్వాసములోనిది. విశ్వామిత్రుడు శ్రీరాముని నిద్రలేపు సందర్భం. మహాస్వామి వారు పై పద్యం చదివి, “మీ నాన్నగారు దారినపోతూ ఎప్పుడూ ఈ పద్యం చదువుతూ ఉండేవారు కదా?” అని శాస్త్రి గారిని అడిగారు.

ఏనాడో గతించిన వారి నాన్నగారు ఆ పద్యాన్ని ఎంత ఆర్తిగా చదివే వారో అలాగే స్వామి వారు ఎట్లా చదవగలిగారు!


 10-12-1990 ప్రమోదూత మార్గ శిర బహుళ నవమి నాడు శాస్త్రి గారు బాలా త్రిపుర సుందరి అమ్మ వారి ఒడిలోకి శాశ్వతంగా చేరి పోయారు. వారి పార్ధివ దేహానికి అగ్ని సంస్కారం చేస్తున్నప్పుడు అమ్మ వారి ఆకారంగా చితి మంటలు ఆకాశానికి లేవటం ఎందరో చూసి పరమాద్భుతంగా వర్ణించారు. శాస్త్రి గారు కారణ జన్ములు. వారి పేరు వింటే చాలు సకల శుభాలు జరుగుతాయి.
🙏🙏🙏

Friday, April 3, 2020

‘‘మాసికాలు ఎందుకు పెట్టాలి?‘‘‘‘అన్ని మాసికాలు పెట్టాలా? కొన్నిమానేయవచ్చా?‘‘మాసికాల రహస్యం ఇదే!

మాసికాల రహస్యం ఇదే!

అనంతసాహితి-పితృదేవతారాధనా రహస్యాలు- 045

‘‘మాసికాలు ఎందుకు పెట్టాలి?‘‘
‘‘అన్ని మాసికాలు పెట్టాలా? కొన్నిమానేయవచ్చా?‘‘
-----------------------------------------------------
మహాభారతంలో చాలామందికి తెలియని ఒక విచిత్రఘట్టం ఉంది. అది వ్యాసప్రసాదితమై ఈ విధంగా ఉంది.
కురుక్షేత్రంలో జరిగిన భీకరసంగ్రామంలో 18 అక్షౌహిణుల సైన్యం 18 రోజుల్లో నాశనం అయింది. కలుగులోని ఎలుకలా దాక్కున్న దుర్యోధనుడిని బయటకు లాగి చంపేశారు.  అనంతరం మృతులకు పూర్వక్రియలు, ఔర్థ్వక్రియలు చేయడానికి అంతా గంగా నది చెంతకు చేరుకున్నారు. ఆ సమయంలో అంతఃపుర కాంతలు అందరితో ధృతరాష్ట్రుడు కూడా వచ్చాడు. వచ్చిన వారి ఏడుపులతో ఆ ప్రాంతం హృదయవిదారకంగా తయారైంది. అప్పుడు అది చూసిన వ్యాసుడు వారికి ఒక వరం ఇచ్చాడు. చనిపోయిన వారిలో ఎవరిని చూడాలనుకుంటే వారిని చూసే వరం అక్కడకు వచ్చిన వారికి ఇచ్చాడు. దాంతో అంతా తాము చూడాలనుకుంటున్న వారిని స్మరించారు. వారు కోరుకున్న వారంతా అక్కడకు ప్రత్యక్షం అయ్యారు. సంతోషంగా తమ ఇష్టులతో వారు గడిపిన కాసేపు అయిన తరువాత చనిపోయిన వారు వెళిపోయే సమయం వచ్చింది. అప్పుడు వ్యాసుడు ‘‘చనిపోయిన వారితో ఎవరైనా వెళ్ళదిలస్తే వారు కూడా వెళ్ళవచ్చు‘‘ అని మరో వరం ఇచ్చాడు. కొంతమంది తమ ప్రియాతి ప్రియమైన వారి ప్రేతాత్మతో కలసి  వెళిపోయారు. 

ఇది చాలా అరుదైన వరం. చనిపోయిన వారిని చూడవచ్చా? అంటే చర్మచక్షువులతో చూడలేము. కేవలం జ్ఞానచక్షువులు, వ్యాసాది మహర్షులిచ్చే దివ్యచక్షువులతో చూడగలము అని ఈ ఘట్టం ద్వారా తెలుసుకోవచ్చు. అయితే నేడు పితృయజ్ఞాలను అవహేళన చేసే వారు ఎక్కువయ్యారు. వేదవేదాంతాలలో ఉన్న మహాసాధనా రహస్యాలు చెపుతుంటే చొప్పదండు ప్రశ్నలు వేసేవారు కొందరైతే, మరికొందరు తమ సున్నతమైన వేదబోధ గమనించకుండా కుతర్కాలు చేస్తున్నారు. దీనికి ప్రధాన కారణం ఈ పితృయజ్ఞాలలోనే ఉంది. అతి తేలిగ్గా సకల పుణ్యాలు, సకల సంపదలూ ఇచ్చే ఈ పుణ్యకార్యాలు ఆచరించకుండా పిశాచగ్రస్తులు అడ్డుపడుతుంటారు. కనుకనే ఈ మంచి మాటలు వారి చెవులకు సోకవు. కేవలం పితృదేవతల అనుగ్రహం ప్రాప్తం ఉన్నవారిని మాత్రమే ఇవి చేరుకుంటాయి. 

చాలా మందికి కొన్ని మంచి సందేహాలు కూడా  వచ్చాయి. చనిపోయిన తరువాత జీవుడు ఏమవుతాడు? మనం పెట్టే పిండాలు వారికి ఎలా చేరుతాయి? దేవతగా ప్రేత ఎలా మారుతుంది? పిండాల వల్ల ప్రయోజనం ఏమిటి? అనేవి అందులోని ముఖ్యప్రశ్నలు.

వీటికి సమాధానం ఒక ఉపనిషత్తు చెబుతోంది. ఆ ఉపనిషత్తు పేరు పిండోపనిషత్తు. ఇది అథర్వణ వేదశాఖకు చెందినది. ఈ వేదం ఎక్కువగా కర్మయోగానికి చెందినది. ఇందులో నిత్యనైమిత్తికకామ్య యజ్ఞాలు ఎలా చేయాలో ఎక్కువగా ఉంటుంది. దీనికి చెందిన ఈ ఉపనిషత్తులో ఈ రహస్యాలు చెప్పారు.

బ్రహ్మదేవుని దేవతలు, మహర్షులు ఈ విధంగా ప్రశ్నించారు.
మృతులకు సమర్పించిన పిండాలను వారు ఏవిధంగా స్వీకరిస్తారు? అనే ప్రశ్నలు వేశారు. దానికి సమాధానంగా బ్రహ్మ దేహం దేహి గురించి వివరాలు చెప్పాడు.

మరణించిన తరువాత పాంచభౌతికమైన శరీరం నుంచీ పంచభూతాలూ విడిపోతాయి. ఈ శరీరం భూమి, నిప్పు, నీరు, గాలి, ఆకాశం అనే మహాభూతాలతో ఏర్పడింది. ఎప్పుడైతే ఇందులోని దేహి శరీరం నుంచీ వెళిపోతాడో, పంచభూతాలు కూడా ఎలా వచ్చినవి అలానే వెళిపోతాయి. ఇది ఆధునిక వైద్యశాస్త్రజ్ఞలు కూడా అంగీకరించినదే. ముందుగా గాలి వెళిపోతుంది (ఊపిరి తీసుకోవడం). దాని వలన పంచప్రాణాలు పోతాయి. గాలి తరువాత అగ్ని పోతుంది. శరీరం చల్లబడుతుంది. వైశ్వానరాగ్ని వెళిపోతుంది. తరువాత శరీరంలో ఉన్న నీరు తోలుతిత్తిలోని తొమ్మిది రంధ్రాల నుంచీ కారిపోతుంది. ఎప్పుడైతే గాలి, నీరు, నిప్పు శరీరం నుంచీ తప్పుకున్నాయో భూతత్త్వం అయిన ధాతువులు ఎముకలు వెంట్రుకలు గోళ్ళు వంటి రూపంలో మిగులుతాయి. ఇవి భూమిలో కలిసిపోతాయి. శరీరాకాశం మహాకాశంలో కలిసిపోతుంది. క్లుప్తంగా జరిగేది ఇదే. ఇది పంచభూతాలు వెళిపోయే విధానం.

నిజానికి మనకు కనిపించే స్థూలమైన బాహ్య శరీరంతో పాటుగా ప్రతీ ఒక్కరికీ కారణ శరీరం, యాతనా శరీరం అని ఉంటాయి. కారణ శరీరం మరో జన్మకు మనం చేసుకున్న పాపపుణ్యాల సంచులు మోసే శరీరం. తన సంచుల్లో ఉన్న పాపపుణ్యాల ప్రకారం  మరో శరీరం వెతుక్కుంటూ వెళిపోతుంది. అదే నూతన శరీరం పొందుతుంది. యాతనా శరీరం నరకానికో లేక స్వర్గానికో వెళిపోతుంది. ఇలా వివిధ శరీరాలు ఎవరి దోవన అవి వెళిపోతే మృతుని ప్రేత మిగిలి ఉంటుంది. 

ప్రేత ముందు పదిరోజులూ తన ఇల్లూ, తన పరివారం, తన ఆస్తులు చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఆ సమయంలో వేసే నిత్యపిండం కాకి రూపంలో వచ్చి తీసుకుంటుంది. దీని తరువాత పదోరోజున సపిండులు, సగోత్రీకులు, బంధువులు, స్నేహితులు వచ్చి వదిలే ఉదకాలు దాని దాహాన్ని తీరుస్తాయి. వీటికి తృప్తి పడి అది పదిరోజుల తరువాత తన వారిని, నా అనుకునే వారిని వదిలి వెళిపోతుంది. అయితే ఇది ప్రేత రూపంలోనే ఉంటుంది. పూర్వక్రియలు అయిన దహన సంస్కారాది 12 రోజుల క్రియలు పూర్తి అయి, మధ్యమ క్రియలు అయిన మాసికాలు జరిగి, పూర్వక్రియలకు అర్హమైన సపిండీకరణం జరిగే వరకూ   ఈ ప్రేత రూపంలోనే ఉంటుంది. సపిండికరణం తరువాత తన ముందున్న వర్గత్రయంలో తన తండ్రి తాత ముత్తాతల్లో ముత్తాతను ముందు జరిపి ఆయన ఖాళీలో తాతను, తాత స్థానంలో తండ్రిని, తండ్రి స్థానంలో తాను చేరుకుంటుంది. పితృదేవతాస్థానం పొందుతుంది.

దీనికి కావలసిన క్రొత్త శరీరం మాసికాల ద్వారా చేసే ఏకోద్దిష్టశ్రాద్ధాల రూపంలో అందుతుంది. నిన్నటి బాహ్యశరీరాన్ని విడిచి కారణశరీరం, యాతనా శరీరం కోల్పోయి ప్రేతగా ఏ శరీరం లేకుండా ఉన్న మృతుడు మాసికాలలో కేవలం తనకు మాత్రమే ఉద్దేశించి వదిలే పిండాల ద్వారా క్రొత్త శరీరం సంతరించుకుంటాడు.  

వీటిలో మొదటి పిండం  ద్వారా క్రొత్త శరీరానికి బీజం పడుతుంది. దీన్నే కలనం అన్నాడు. 

దీని తరువాత మాంసం చర్మం రెండో పిండం ద్వారా ఏర్పడతాయి. 

మూడో పిండం వలన బుద్ధి కలుగుతుంది. (మెదడు). 

నాలుగో పిండం వలన ఎముకలు, ఎముకల్లోని గుజ్జు ఏర్పడతాయి. 

ఐదో పిండం వలన శిరస్సు, ముఖం, వేళ్ళు ఏర్పడతాయి. 

ఆరో పిండం వలన హృదయం, మెడ, నోటిలోని భాగాలు  ఏర్పడతాయి.

ఆయుప్రమాణం ఏడో పిండం ద్వారా కలుగుతుంది. 

ఎనిమిదో పిండం ద్వారా మాటకు చెందిన వ్యవస్థలు కలుగుతాయి.  

తొమ్మిదో పిండం ద్వారా అన్ని అవయవాలకు పరిపుష్టి చేకూరి దృఢపడతాయి. 

పదో పిండం వలన క్రొత్త జీవితానికి అవసరమైన శారీరక పరిపూర్ణత చేకూరుతుంది.

ఈ విధంగా మాసికాలలోని పిండదానం వలన పిండశరీరం నుంచీ సంపూర్తి శరీరం పిండాల వలన కలుగుతుంది. ప్రపంచంలో భోగాలు అనుభవించడానికి శరీరం ఇచ్చిన తల్లి తండ్రులకు మాసికాలు నిర్వహించి వారికి శరీరం ఏర్పడడానికి అవసరమైన పిండాలు సమర్పించి వారి ఋణం తీర్చుకోవాలి.
 
నిజానికి మొత్తం 16 పిండాలు ఈ సంవత్సర కాలంలో ఇస్తారు. వీటిలో 10 పిండాల గురించి  మృతుడు క్రొత్త శరీరాలు పొందడానికి దోహదం చేసే ఆహారంగా ఉపయోగిస్తాయని పిండోపనిషత్తు చెప్పింది, మిగిలిన పిండాల గురించి గరుడపురాణంతో పాటు అనేక పురాణాలు చెబుతున్నాయి.

అంతేకాక మృతుని శరీరం నుంచీ పంచభూతాలు ఏవిధంగా దూరం అవుతాయో అదే విధంగా తిరిగి వారికి భౌతిక శరీరం ఏర్పడడానికి పంచభూతాలూ కలుస్తాయి. ముందుగా జీవికి ఆస్తిక్యం ఇవ్వడానికి కారణం అయిన ఆకాశం అతనికి స్థలం ఇస్తుంది. ఆ తరువాత అగ్ని, జలం, వాయువు, భూమి తత్త్త్వాలు అతనికి శరీరం కల్పిస్తాయని ఉపనిషత్తు చెబుతోంది. 

కనుక మృతులకు మాసికాలు అన్నీ పెట్టవలసిందే. మాసికాలకు ప్రత్యామ్నాయం లేదు. ఏది వదిలితే అది ఎన్నో పిండమైతే ఆ దశలో ఏర్పడాల్సినవి ఏర్పడక మృతునికి వైలక్యం కలుగుతుంది. మనకు కోట్లు ఖరీదు చేసినా దొరకని భోగశరీరాన్ని ఇచ్చిన తండ్రికి ఇంత పిండం పెట్టకపోవడం వలన అతనికి వైకల్యం కలిగించినవారమవుతాము. మహాఘోరమయ్యే తప్పు చేయకూడదు. 

మాసికాలు మానివేస్తే ఇటువంటి వైకల్యం కలుగుతుంది. సపిండీకరణం చేయకపోతే పితృదేవతా రూపం రాదు. తండ్రికి ప్రేతత్త్వం విడుదల చేయకపోతే తరువాత తరాలు అన్నీ ప్రేతత్త్త్వంలోనే ఉండిపోతాయి. కనుక మధ్యమ క్రియలైన మాసికాదులు చేయడం చనిపోయిన వారికి మాత్రమే కాదు, కర్తకు కూడా లాభం చేకూర్చేది. తనకు దుర్గతి రాకుండా మంచి మార్గం వేసుకోవడం వంటిది. 

ఇవి మన పురాణాలు, ఉపనిషత్తులు చెబుతున్న పితృయజ్ఞరహస్యాలు.   

ఇవన్నీ సమాన్యంగా తప్పనిసరిగా చేయవలసినవి. ఇవే మరింత ప్రేమగా చేయాలనుకుంటే పుణ్యక్షేత్రాలైన కురుక్షేత్రం, ప్రయాగ, కాశీ, గయా వంటి వాటిలో చేయాలి. ఇలా చేస్తే వారికి విశేషమైన శరీరాలు కలిగించిన వారమవుతాము. దాని వల్ల మనకే ప్రయోజం ఉంటుంది. వారికి కలిగే ఉత్తమ శరీరాల వల్ల పరమానందం పొంది మరింతగా సకల సంపదలు మనకు ఇస్తారు.

పిండాలు ప్రేతాలకు వెళతాయా? అని వితండవాదం చేసే వారికి సమాధానమే ఈ పిండోపనిషత్తు. 

నిజానికి ఉపనిషత్తులు అన్నీ రహస్యాల సమూహాలు. అవి పైకి ఒక అర్ధంలో కనిపించే సామాన్యపదాలుగా కనిపించినా వాటి వెనుక కేవలం మహాసాధకులకు మాత్రమే తెలిసే అనేక రహస్యాలు ఉంటాయి. అవి కేవలం సాధకులు, పరిశ్రమ చేసిన విజ్ఞులు మాత్రమే అందుకోగలుగుతారు. వీటిని వారు అందరికీ చెప్పరు. కేవలం ఫలానా పిండదానాలు ఫలానా చోట చేయండి అనిమాత్రమే చెబుతారు. గయలో ఎందుకు చేయాలి? ప్రయాగలో ఎందుకు చేయాలి అంటే వాటికి అనేక రకాలైన కారణాలు కూడా చెబుతారు. పుణ్యక్షేత్రాలుగా చెబుతున్న ప్రాంతాలు అన్నీ పరమాత్మ శరీరాంగాలు. ఒకటి శిరస్సు, మరొకటి హృదయం, కాళ్ళు, చేతులు.... వంటివి. 

ఇలా ఆ ప్రాంతాలలో చేయలేని వారు కనీసం తాను ఉన్న చోటునైనా చేయాలి. వెళ్ళగలిగిన వారు ప్రయాగ కుంభమేళాల వంటి వాటికి వెళ్ళి చేయడం వలన దివ్యమైన ఫలితాలు పితృదేవతానందం వలన కలుగుతాయి.  
వెళ్ళలేని వారు మానసికంగా అయినా వాటిని కీర్తించడం వలన పుణ్యం పొందుతారు. 

ఉదాహరణకు రాబోయే మాఘపౌర్ణమి చాలా మంచిది. దాన్ని మాఘపౌర్ణమి, మహామాఘి అని అంటారు. ఆ రోజున పితరలకు ప్రయాగలో పిండప్రదానం చేస్తే దివ్యమైన ఫలాలు, సంపదలు కలుగుతాయి. ప్రయాగలో చివరిగా రాబోతున్న మహాశివరాత్రి స్నానానికి ముందు రానున్న పుణ్యదినం.  ఆ సమయానికి వెళ్ళలేని వారు మానసికంగా అయినా తమపెద్దలకు నమస్కరించుకొని స్వధానామసాధన చేసి, స్వధా స్తోత్రం, పితృస్తోత్రం పఠించుకొని ఆవుకు ఒకరోజు గ్రాసం వేయడం వలన కూడా ఉత్తమ పుణ్యసంపదలు ఉన్న చోటు నుంచే పొందవచ్చు.

ఇవే మాసికాలు పిండప్రదానాల రహస్యాలు. 

మాఘమాసం పితృదేవతా అర్చనలకు మహాదివ్యమైన కాలం. 

 దివ్యాత్మస్వరూపులారా!

ఇప్పటి వరకూ స్వధానామసాధన, స్వధాస్తోత్రపఠనం చేసిన సాధకులకు ఇదిసాధనలో రెండో సోపానం. సాక్షాత్తూ బ్రహ్మదేవుడు చెప్పగా వ్యాసభగవానుడు ప్రసాదించిన దివ్యమైన పితృస్తోత్రం అందిస్తున్నాము.  దీన్ని చదువుకున్న వారి సర్వపాపాలూ పితృదేవతైన తండ్రి తొలగిస్తాడు. ఇది మూడు కాలాలలో లేదా రెండు కాలాలలో లేదా కనీసం రోజుకు ఒక సారి అయినా చదువుకుంటే సకల దరిద్రాలూ తొలగిపోతాయి. సకల కష్టాలూ తొలగిపోతాయి. సర్వకార్యాలలో జయం సిద్ధిస్తుంది. సకల దేవతలూ సంతోషించి సకల కోరికలూ తీరుస్తారు. 

దీన్ని స్వధా స్తోత్రం అనంతరం చదువుకోవాలి. తండ్రి బ్రతికే ఉన్నవారు ఇంకా అదృష్టవంతులు. ఈ స్తోత్రాన్ని తండ్రి సన్నిధిలో చదువుకొని ఆయన పాదాలకు నమస్కరించుకుంటే దివ్యమైన ఫలితాలు కలుగుతాయి. చేసిన పాపాలు అన్నీ నాశనం అవుతాయి. 
🙏🏻🙏🏻🙏🏻